కలం, వెబ్ డెస్క్: వినాయక చవితి (Vinayaka Chavithi )ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా.. అందరు ఒక్క చోటకు చేరి ఆనందంతో జరుపుకునే పర్వదినం ఇది. గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంటే కేవలం కేవలం భక్తి మాత్రమే కాదు.. పండుగ చుట్టూ రూ.వేల కోట్ల వ్యాపారం ముడి పడి ఉంటుంది. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు భారత్లో సుమారు రూ.45 వేల కోట్ల మార్కెట్ జరుగుతుందని సీఏఐటీ తాజా నివేదిక వెల్లడించింది.
20 లక్షల మండపాలు..
దేశ వ్యాప్తంగా సుమారు 20 లక్షల గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తారని సీఏఐటీ అంచనా వేసింది. 9 రోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాల కోసం మండపం డెకరేషన్, పూజా సామగ్రి, ఇతరత్ర అవసరాల కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తుంటారని స్పష్టం చేసింది. అలాగే.. పర్వదినం సందర్భంగా ఉపయోగించే స్వీట్లు, తీపి పదార్థాల కోసం రూ.2,400 కోట్లు వెచ్చిస్తారని వివరించింది.
వినాయక చవితి సందర్భంగా బంగారు, వెండి ఆభరణాల కొనుగోళ్లు కూడా బాగానే జరుగుతుంటాయి. దీని విలువ రూ.1000 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. ఒకప్పుడు దేశానికే పరిమితమైన వినాయక చవితి వేడుకలు.. ఇప్పుడు విదేశాల్లోనూ ఘనంగా జరుగుతున్నట్లు సీఏఐటీ పేర్కొంది.

