కలం, వెబ్ డెస్క్: రష్యా ఉక్రెయిన్ యుద్ధం (Russia Ukraine War) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ రెండు వేల డ్రోన్లతో ఒక్కసారిగా రష్యాపై దాడి చేసింది. యుద్ధం ప్రారంభమైన తరువాత ఉక్రెయిన్ ఈ స్థాయిలో డ్రోన్లతో అటాక్ చేయడం ఇదే మొదటిసారి. ఈ ఘటనలో రష్యాలో ఇద్దరు పౌరులు మరణించగా, 20 మందికి పైగానే గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
రాజధాని మాస్కో సహా అనేక కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసింది.మాస్కోపైకి వచ్చిన సుమారు 450 డ్రోన్లను విజయవంతంగా కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మిగతా భూ భాగాల్లో 1,100 డ్రోన్లను ఇంటర్సెప్టర్ల ద్వారా అడ్డుకున్నట్లు ప్రకటించింది. రష్యా పార్లమెంట్ ఎన్నికలకు ప్రస్తుతం చివరి దశ పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ ఊహించనివిధంగా డ్రోన్లతో దాడి చేయడం కలకలం రేపుతోంది.
అవును దాడి చేశాం: జెలెన్ స్కీ
మాస్కోపై తమ బలగాలు పెద్ద ఎత్తున డ్రోన్ల దాడిని విజయవంతంగా పూర్తి చేశాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. ఈ దాడుల్లో రష్యాలోని కీలక ఆయిల్ నిల్వ కేంద్రం కూడా ధ్వంసమైందన్నారు. ఈ దాడుల్లో పాలు పంచుకున్న ఉక్రెయిన్ ఆర్మీతో పాటు ఫారెన్ ఇంటెలిజెన్స్ విభాగాలకు అభినందనలు తెలిపారు. ఇప్పటికైనా రష్యా తన క్రూరమైన యుద్ధాన్ని వెంటనే ఆపేయాలన్నారు. ప్రపంచ ఆహార, శక్తి వనరుల భద్రత కోసం వెంటనే కాల్పుల విరమణ పాటించాలని సూచించారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై ఇంకా రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించలేదు. 2022 ఫిబ్రవరి 24న ప్రారంభమైన రష్యా–ఉక్రెయిన్ యుద్ధం.. నాలుగున్నరేళ్లు పూర్తవుతున్నా ఇంకా ఆగిపోవడం లేదు.

