కలం, వెబ్డెస్క్: పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్నేహితులతో ఈతకు వెళ్లిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం సెలవు రోజు కావడంతో పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలోని వేండ్ర కాలువ వద్ద ఈత కొట్టేందుకు ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల బృందం వచ్చింది. ఈత కొట్టేందుకు విద్యార్థులు కాలువలోకి దిగారు. వరద ప్రవాహాన్ని గమనించకుండా కొంచెం లోపలికి వెళ్లారు.
ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయారు. కాలువలో మునిగి భీమవరానికి చెందిన పెరుమాళ్ విఘ్నేష్, పార్వతీపురానికి చెందిన రాహుల్ మృతి చెందారు. మరో ముగ్గురు సాయి, శివకుమార్, చక్రేష్ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. స్థానికుల సమాచారంతో అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను బయటకు తీశారు. సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్న విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పాలకోడేరు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

