కలం, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉదయ్కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ (ఆగస్టు 11వ తేదీ వరకు) విధించింది. ఈ మేరకు పోలీసులు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల కేసులో ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్కృష్ణారెడ్డి మంగళవారం మిర్యాలగూడలో అరెస్ట్ అయ్యారు. ఈ నెల 22 నుంచి పరారీలో ఉన్న ఆయనను..మిర్యాలగూడలో అదుపులోకి తీసుకొని అక్కడనుంచి సికింద్రాబాద్ టాస్క్ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. బుధవారం ఉదయం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. ఉదయ్కృష్ణారెడ్డికి రిమాండ్ విధించింది.
నేషనల్ పోలీసు అకాడమీలో తనపై వేధింపులకు పాల్పడ్డాడని అత్తాపూర్ పోలీసులకు మహిళా ట్రైనీ ఐపీఎస్ ఈ నెల 18న ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనను లైంగికంగా వేధించడంతోపాటు వ్యక్తిగత వీడియోలను తన భర్తకు పంపించి ఇబ్బందులకు గురి చేశాడని బాధితురాలు ఫిర్యాదు పేర్కొనడంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే ఉదయ్ కృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవగా.. పోలీసులకు కనిపించకుండా పరారీ అయ్యారు. సెల్ఫోన్ కూడా స్విచ్చాఫ్ కావడంతో నాలుగు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలించి ఉదయ్కృష్ణారెడ్డిని మిర్యాలగూడలో అరెస్ట్ చేశారు.

