కలం, వెబ్ డెస్క్ : తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చెంబడిపాళెం సమీపంలోని జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం (Tirupati Accident) చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి నెల్లూరు వైపు వేగంగా వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ వోల్వో బస్సు, రోడ్డు పక్కన ఆగి వున్న కట్టెల లోడు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్నారు.
ఈ ఘటనలో బస్సు డ్రైవర్తో పాటు దాదాపు 16 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారందరినీ వెంటనే నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు రిఫర్ చేశారు. ఈ ప్రమాదంపై పెళ్లకూరు ఎస్ఐ ఆదిలక్ష్మి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

