కలం, వెబ్ డెస్క్ : తిరుమల (Tirumala) పుణ్యక్షేత్రం పరిసరాల్లో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. అలిపిరి టోల్ గేట్ సమీప ప్రాంతంలో తెల్లవారుజామున ఒక చిరుతపులి సంచరిస్తూ కనిపించింది. అదే సమయంలో అక్కడ ఉన్న ఒక జింకను చిరుతపులి వేటాడి చంపి తిన్నట్లు తెలుస్తోంది. దీంతో అలిపిరి మార్గంలో వెళ్లే భక్తులు, స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
ఘటన జరిగిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విజిలెన్స్ అధికారులు, అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. చిరుత సంచరించిన ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి భక్తులకు ఎటువంటి హాని కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. అలిపిరి నడక దారి, ఘాట్ రోడ్ పరిసరాల్లో నిఘాను పెంచిన అధికారులు భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ..
తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 4 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించడానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 27,300 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, వారిలో 9,985 మంది మొక్కులు చెల్లించుకుని తలనీలాలు సమర్పించారు. ఇక భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.46 కోట్లుగా నమోదైందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
మంగళవారం చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని దాదాపు పది గంటల పాటు మూసివేసిన సంగతి తెలిసిందే. గ్రహణానంతరం సంప్రదాయబద్ధంగా శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి తిరిగి దర్శనాలను పునఃప్రారంభించారు.

