కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ బోర్డు (HGCL Board) ఆఫ్ డైరెక్టర్స్ను పునరుద్ధరించింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్ మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం జీవో జారీ చేసింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టుల సమన్వయం, సమగ్ర ప్రణాళిక, భూసేకరణ, పనులను సకాలంలో పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ బోర్డును బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కొత్త బోర్డుకు మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ చైర్మన్గా వ్యవహరించనున్నారు. హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ వైస్ చైర్మన్గా, HGCL మేనేజింగ్ డైరెక్టర్ మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగనున్నారు. అలాగే GHMC, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, HMWSSB, HYDRA, HMRL, HAMLAలకు చెందిన అధికారులు నామినీ డైరెక్టర్లుగా బోర్డులో స్థానం ఉంటుంది.
వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థల మధ్య మెరుగైన సమన్వయంతో మౌలిక వసతుల ప్రాజెక్టులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ పునర్వ్యవస్థీకరణ దోహదపడుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. భూసేకరణతో పాటు ప్రాజెక్టుల అమలులో ఎదురయ్యే సమస్యలను సమన్వయంతో పరిష్కరించేందుకు కొత్త బోర్డు కీలకంగా వ్యవహరించనుంది. బోర్డు పునరుద్దరణకు అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్కు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

