కలం, వెబ్ డెస్క్ : వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ కూడా పోటీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్కు విజ్ఞప్తి ఓ వీడియో రిలీజ్ చేశారు.
జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో బలమైన రాజకీయ, ప్రజా మద్దతును సాధించిన జనసేనకు తెలంగాణలోనూ మంచి అవకాశాలు ఉన్నాయని రాజాసింగ్ చెప్పుకొచ్చారు. తెలంగాణలో పవన్ కల్యాణ్ కు ఉన్న ప్రజాదరణ, యువతలో పార్టీకి ఆదరణతో తెలంగాణలో జనసేన బలమైన రాజకీయ శక్తిగా మారగలదని వ్యాఖ్యానించారు. తెలంగాణ బీజేపీ నాయకత్వంపై ధిక్కార స్వరం వినిపిస్తున్న రాజాసింగ్ తాజా వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటి ? అనే ప్రశ్నలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బీజేపీకి దూరంగా ఉంటున్న ఆయన జనసేనలో చేరే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా రాజాసింగ్ చేస్తున్న విజ్ఞప్తిపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించి.. ముందుకు వెళ్తారా? లేదా? అనేది 2028 ఎన్నికలకు ముందు కీలక రాజకీయ చర్చగా మారే అవకాశం ఉంది.

