కలం, వెబ్ డెస్క్ : హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా వాణిజ్య నౌకల రాకపోకలకు సంబంధించి ఇరాన్ (Iran) ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మార్గం ద్వారా అన్ని రకాల వాణిజ్య నౌకలు ప్రయాణించవచ్చని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగిసే వరకు ఈ రాకపోకలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ (Iran) తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించడమే కాకుండా, టెహ్రాన్కు తన కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే, పూర్తిస్థాయి ఒప్పందం కుదిరే వరకు ఇరాన్పై ఉన్న దిగ్బంధాన్ని మాత్రం కొనసాగిస్తామని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా 11 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తగ్గి, నౌకల ప్రయాణం పునరుద్ధరించబడటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చే అంశంగా మారింది. కాగా, ఈ సంక్షోభ పరిష్కారానికి సంబంధించి వచ్చే వారమే పాకిస్థాన్ వేదికగా మరో విడత చర్చలు జరగనున్నాయి.
ట్రంప్ రియాక్షన్..
హర్మూజ్ జలసంధిని వాణిజ్య కార్యకలాపాల కోసం పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రపంచ దేశాలన్నింటికీ ఒక చిరస్మరణీయమైన రోజని ఆయన అభివర్ణించారు. ఇరాన్ తీరాల్లో అమెరికా సహాయంతో సముద్రపు మైన్ల తొలగింపు ప్రక్రియ విజయవంతంగా సాగుతోందని, దీనివల్ల నౌకల రాకపోకలకు మార్గం సుగమమైందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని కలిగి ఉండబోదని ఈ సందర్భంగా ట్రంప్ స్పష్టం చేశారు. తాజా పరిణామాలు అంతర్జాతీయ శాంతికి దోహదపడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

