కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్లోని కూకట్పల్లి (Kukatpally)లో శనివారం రాత్రి ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. గచ్చిబౌలి నుండి పాలకొల్లుకు బయల్దేరిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సులో ఉన్న 18 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ముప్పు తప్పింది.
గచ్చిబౌలిలో ప్రయాణికులతో బయల్దేరిన ఈ బస్సు కొండాపూర్, మియాపూర్ మీదుగా కేపీహెచ్బీ (KPHB) ప్రాంతానికి చేరుకోగానే, ఇంజిన్ భాగంలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. బస్సులో పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని నిలిపివేసి, ప్రయాణికులను కిందకు దిగిపోవాల్సిందిగా హెచ్చరించారు. అందరూ కిందకు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు.

