కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh Rain)లో రాగ కొన్ని గంటల్లో వాతావరణంలో తీవ్ర మార్పులు రానున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో సముద్రం అలజడిగా మారే ప్రమాదం ఉన్నందున, మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది.
మరోవైపు విజయనగరం, మన్యం, అల్లూరి, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ముప్పు ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

