కలం, వెబ్ డెస్క్: కేంద్రం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆదివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్లు(Stock Markets) పని చేయనున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్(NSE), బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE)ల్లో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించనున్నారు. సాధారణంగా ఆదివారాలు స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది. కానీ, బడ్జెట్ రోజు మార్కెట్ కార్యకలాపాలు కొనసాగడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్కు సంబంధించి పెట్టుబడిదారులకు కొన్ని కీలక నిబంధనలు వర్తిస్తాయని ఎక్స్చేంజ్ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా శనివారం కొనుగోలు చేసిన షేర్లను ఈరోజు విక్రయించేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. దీనికి కారణం సెటిల్మెంట్ విధానం పూర్తవ్వకపోవడమేనని అధికారులు తెలిపారు. అయితే గత ట్రేడింగ్ రోజులలో కొనుగోలు చేసిన షేర్లను మాత్రం విక్రయించుకునే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా కొనుగోళ్లు చేయడంపై ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొన్నారు. ఈరోజు బడ్జెట్లో ప్రభుత్వం తీసుకునే ఆర్థిక నిర్ణయాలు, పన్ను విధానాలు, కేటాయింపులు, కార్పొరేట్ రంగానికి ఇచ్చే ప్రోత్సాహకాలు మార్కెట్ను ప్రభావితం చేసే అవకాశం ఉంది.


