శశాంక్ సింగ్ కీలక నిర్ణయం.. ఛత్తీస్‌గఢ్‌కు గుడ్‌బై

కలం, స్పోర్ట్స్ : ఛత్తీస్‌గఢ్ క్రికెట్‌కు శశాంక్ సింగ్ (Shashank Singh) గుడ్‌బై చెప్పాడు. 2026-27 దేశవాళీ సీజన్‌లో పుదుచ్చేరి (Puducherry) తరఫున ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఛత్తీస్‌గఢ్ క్రికెట్ సంఘం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) కూడా పొందాడు. రాష్ట్ర జట్టు నుంచి తనకు సరైన మద్దతు, స్పష్టత కనిపించలేదని శశాంక్ తెలిపాడు. ఛత్తీస్‌గఢ్ క్రికెట్ ప్రీమియర్ లీగ్‌కు తనను ఎంపిక చేయకపోవడానికి కారణం చెప్పలేదని పేర్కొన్నాడు. అలాగే రాష్ట్ర ప్రాబబుల్స్ కండిషనింగ్ క్యాంప్‌కు తనను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో కూడా వివరించలేదని చెప్పాడు. కొందరు అధికారులు తనను గౌరవంగా చూడలేదనే భావన కూడా ఛత్తీస్‌గఢ్‌ను వీడాలనే నిర్ణయానికి కారణమైందని వెల్లడించాడు.

అయితే ఈ అంశాన్ని వివాదంగా మార్చడం కంటే కెరీర్‌లో ముందుకు సాగడమే మంచిదని శశాంక్ భావించాడు. తన క్రికెట్ కెరీర్ ఎక్కువ కాలం ఉండదని, అందుకే తనకు సరిపోయే అవకాశాన్ని ఎంచుకున్నానని చెప్పాడు. పుదుచ్చేరి నుంచి వైట్ బాల్ క్రికెట్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం లభించిందని, అందుకే ఈ సీజన్‌లో వన్డేలు, టీ20లపైనే ప్రధానంగా ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.

2024 ఐపీఎల్‌లో మెరుపులు

2024 ఐపీఎల్‌లో శశాంక్ సింగ్ అద్భుతంగా రాణించాడు. 354 పరుగులు సాధించి 164.65 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. 2024-25 విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆల్‌రౌండర్‌గా సత్తా చాటాడు. ఏడు మ్యాచ్‌లలో 450 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనకు గుర్తింపుగా 2023-24 సీజన్‌కు బీసీసీఐ బెస్ట్ డొమెస్టిక్ వైట్ బాల్ ఆల్‌రౌండర్ అవార్డును అందుకున్నాడు. అయితే ఇటీవల ఐపీఎల్ సీజన్‌లో ఫామ్ సమస్యలు, క్యాచ్‌లు జారవిడవడం, గాయాల ఆందోళన అతడిని ఇబ్బంది పెట్టాయి. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్‌లు వదిలిన తర్వాత ఫీల్డింగ్‌పై తనలో నమ్మకం తగ్గిందని శశాంక్ చెప్పాడు.

ఫీల్డింగ్‌పై మళ్లీ ఫోకస్

తన ఫీల్డింగ్ సమస్య టెక్నికల్ అంశం కాదని శశాంక్ స్పష్టం చేశాడు. ఫీల్డింగ్‌ను ఆస్వాదించడం మానేయడమే అసలు సమస్యగా గుర్తించినట్లు తెలిపాడు. చిన్ననాటి కోచ్‌లు ఎప్పుడూ ఫీల్డింగ్‌ను ఆస్వాదించాలని చెప్పేవారని గుర్తుచేసుకున్నాడు. ఐపీఎల్ అనంతరం కోచ్‌లు, చిన్ననాటి స్నేహితులతో మాట్లాడినప్పుడు వారు కూడా ఇదే విషయాన్ని గుర్తించారని చెప్పాడు. ఇకపై బ్యాటింగ్, బౌలింగ్‌లాగే ఫీల్డింగ్‌ను కూడా ఆస్వాదించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.

వైట్ బాల్ క్రికెట్‌పైనే దృష్టి

2026-27 సీజన్‌లో మూడు ఫార్మాట్లలో ఆడటం కంటే వైట్ బాల్ క్రికెట్‌పైనే దృష్టి పెట్టాలని శశాంక్ నిర్ణయించుకున్నాడు. బౌలర్‌గా, ఆల్‌రౌండర్‌గా మరింత మెరుగుపడటానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని భావిస్తున్నాడు. గత సీజన్‌లో గాయం కారణంగా ఎక్కువ దేశవాళీ క్రికెట్ ఆడలేకపోయానని తెలిపాడు. అయితే ఈ ఏడాది బౌలింగ్ చేయాలనే లక్ష్యంతో మానసికంగా సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కారణంగా తనను అదనపు బౌలింగ్ ఆప్షన్‌గా ఉపయోగించే అవకాశం ఉంటుందని ముందే తెలుసని శశాంక్ వివరించాడు. బౌలింగ్ యూనిట్ విఫలమైనప్పుడు మాత్రమే తనకు ఎక్కువ ఓవర్లు వేసే అవకాశం రావచ్చని పేర్కొన్నాడు. ఇకపై పుదుచ్చేరి తరఫున వైట్ బాల్ క్రికెట్‌లో తన సామర్థ్యాన్ని మరింతగా చూపించడమే లక్ష్యంగా శశాంక్ సింగ్ ముందుకు సాగుతున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>