కలం, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియన్ ఓపెన్ (Australian Open) బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu), యువ సంచలనం తన్వి శర్మ (Tanvi Sharma) క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 10వ ర్యాంకర్ పీవీ సింధు 42 నిమిషాల పాటు సాగిన పోరులో భారత్కే చెందిన ఇషారాని బారువాపై 22-20, 21-12 తేడాతో విజయం సాధించింది. మొదటి గేమ్లో గట్టి పోటీ ఎదురైనప్పటికీ, రెండో గేమ్లో సింధు పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. క్వార్టర్ ఫైనల్లో ఆమె చైనీస్ తైపీకి చెందిన చెన్ సు-యుతో తలపడనుంది.
మరోవైపు 17 ఏళ్ల తన్వి శర్మ సైతం సంచలన ప్రదర్శనతో సీనియర్ ఆటగాడు మాళవిక బన్సోద్ను 21-13, 21-15తో ఓడించి, ఈ ఏడాది రెండోసారి క్వార్టర్స్లోకి అడుగుపెట్టింది. తదుపరి మ్యాచ్లో ఆమె జపాన్ టాప్ సీడ్ అకానె యమగూచిని ఢీకొట్టబోతోంది. అంతకుముందు జరిగిన మిగిలిన విభాగాల మ్యాచ్ల్లో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్లో ఎంఆర్ అర్జున్, హరిహరన్ ఆంసకరుణన్ జోడీ 21-17, 21-7తో న్యూజిలాండ్ జంటపై సులభంగా గెలిచి క్వార్టర్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
అంతకుముందు అచ్యుతాదిత్య రావు, అర్జున్ రెడ్డి జోడీ తొలి రౌండ్లోనే ఓడిపోగా, గాయం కారణంగా స్టార్ జోడీ సాత్విక్-చిరాగ్ ఈ టోర్నీకి దూరమయ్యారు. అందువల్ల ప్రస్తుతం పురుషుల డబుల్స్లో నిలిచిన ఏకైక భారత జోడీ అర్జున్, హరిహరన్ మాత్రమే. ఇక మహిళల సింగిల్స్లో తన్య హేమంత్ థాయిలాండ్ ఆటగాడి చేతిలో, మిక్స్డ్ డబుల్స్లో ధ్రువ్ రావత్, మనీషా కీర్ జంట జపాన్ జోడీ చేతిలో పరాజయం పాలవడంతో ఆ విభాగాల్లో భారత సవాలు ముగిసింది.

