కలం, వెబ్ డెస్క్: దేశంలో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డీ లిమిటేషన్ బిల్లు (Delimitation Bill)ను మరోసారి పార్లమెంటులో ప్రవేశ పెట్టేందుకు రంగం సిద్ధమైంది. బిల్లుపై అభ్యంతరం చెబుతున్న పార్టీలతో సంప్రదింపులు కొనసాగిస్తూనే.. అవసరమైన మెజార్టీని సమకూర్చుకునేందుకు ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు..
గత ఏప్రిల్ నెలలో జరిగిన సమావేశాల్లో డీ లిమిటేషన్ బిల్లు పాస్ కాకుండా ప్రతిపక్షాలు కలిసికట్టుగా అడ్డుకున్నాయి. దీంతో, ఈ బిల్లును అప్పట్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. నాలుగు నెలలుగా పలుమార్లు సమావేశమైన జేపీసీ.. అనేక కీలక సవరణలు ప్రతిపాదించింది. ఈ రోజు చివరి సారి సమావేశమై.. బిల్లు డ్రాఫ్ట్పై చర్చించింది.
బిల్లు పూర్తి స్థాయిలో రెడీ అవుతున్న నేపథ్యంలో.. ఈ సమావేశాల్లోనే ఎలాగైనా పాస్ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం పేరిట తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న డీఎంకేపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. స్టాలిన్ తదితర నేతలతో ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ మాత్రం ససేమిరా..
జేపీసీ ప్రతిపాదించిన సవరణలపై పార్లమెంటులో పూర్తి స్థాయిలో చర్చ జరిగి.. తమకు ఆమోదయోగ్యంగా ఉంటేనే బిల్లుకు అంగీకరిస్తామని కాంగ్రెస్ పార్టీ తేల్చి చెబుతోంది. అంతవరకు ఈ బిల్లుకు ససేమిరా అంటోంది. కాంగ్రెస్ బాటలోనే ఆప్, సమాజ్ వాదీ, శివసేన (ఉద్ధవ్ వర్గం) ఇతర పార్టీలు నడుస్తున్నాయి. అన్ని రాష్ట్రాలకు సీట్ల విషయంలో సమ న్యాయం జరగాల్సిందేనని పేర్కొంటున్నాయి.
పార్లమెంటులో మెజార్టీ ఉంటేనే..
డీ లిమిటేషన్ చేసేందుకు ఉద్దేశించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంటులో 2/3 వంతుల మెజార్టీ అవసరం. రాజ్యసభలో ఇటీవల జరిగిన పరిణామాలతో అక్కడ నెగ్గడం కొంత సులువనే వాదన వినిపిస్తోంది. లోక్సభలో పాస్ అయితే.. డీ లిమిటేషన్ బిల్లుకు దాదాపు అడ్డంకులు తొలగినట్లే. ఈ నేపథ్యంలో, సోమవారం నుంచి ప్రారంభం కానున్న సమావేశాల్లో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. సీట్ల పంపకం ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ నెలకొంది.

