కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ (Warangal) కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం (Kaloji Health University) ఎదుట శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తున్నాయని వారు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా అదనపు ఫీజుల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారని వారు మండిపడ్డారు. లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటున్నప్పటికీ, కనీస వసతులు కూడా కల్పించడం లేదని ఆరోపణలు చేశారు.
అలాగే మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ సమస్య తీవ్రంగా ఉందని, ఇది విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ర్యాగింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. యూనివర్సిటీ గేటు వద్ద బైఠాయించిన తల్లిదండ్రులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రైవేట్ కాలేజీలపై చర్యలు తీసుకునే వరకు తమ నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు.

