కలం, ఆదిలాబాద్: తల్లి, పిల్లల ఆరోగ్య రక్షణతో పాటు జిల్లాలో పోషకాహార లోపాన్ని సంపూర్ణంగా నిర్మూలించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ (Adilabad Collector) రాజర్షి షా (Rajarshi Shah) పిలుపునిచ్చారు. మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన 9వ పోషణ మాసం (పోషణ్ అభియాన్) ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు నెల రోజుల పాటు ‘మన అంగన్వాడీ–మన బాధ్యత’ నినాదంతో జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందించడం ద్వారా మాత్రమే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమని స్పష్టం చేశారు. ముఖ్యంగా రక్తహీనత (అనీమియా) నివారణకు ఆహారంలో వైవిధ్యం పాటించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతిరోజూ పరిశుభ్రమైన వాతావరణంలో తాజా, వేడి వంటకాలు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
చిన్నారుల సమగ్ర మానసిక, శారీరక వికాసానికి జీవితంలోని తొలి దశలో అందించే పోషకాహారం, బాల్య విద్య ఎంతో కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రధానమంత్రి మాతృ వందన యోజన వంటి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తూ, అంగన్వాడీ సేవలను మరింత సమర్థవంతంగా అందించాలని కలెక్టర్ కోరారు.

