కలం, నిర్మల్ : నిర్మల్ కొయ్య బొమ్మల (Nirmal Wooden Toys) కళను పరిరక్షిస్తూ, కళాకారులకు ప్రోత్సాహం అందించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కొయ్య బొమ్మల కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కొయ్య బొమ్మల చరిత్ర, తయారీ విధానం, మార్కెటింగ్, కళాకారుల పరిస్థితి, పొనికి కర్ర లభ్యత తదితర అంశాలపై నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
నిర్మల్ కొయ్య బొమ్మలకు దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్నారు. ఈ కళ ద్వారా నిర్మల్ జిల్లాకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించిందని, తరతరాలుగా కొనసాగుతున్న ఈ కళను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బొమ్మల తయారీకి ప్రధానంగా ఉపయోగించే పొనికి చెట్ల పెంపకానికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.
రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా బాసరలో కొయ్య బొమ్మల ప్రదర్శన, విక్రయాల కోసం ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ పరిశీలనలో డీపీవో శ్రీనివాస్, డీవైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవి బాబు, తహసీల్దార్ రాజు, నిర్వాహకులు పాల్గొన్నారు.

