కలం, నిర్మల్: ఈ నెల 15 నుంచి సమీకృత ఆర్థిక నిర్వహణ సమాచార వ్యవస్థ (ఐఎఫ్ఎంఐఎస్) ద్వారా బిల్లుల సమర్పణ పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్లు నిర్మల్ జిల్లా ట్రెజరీ (Nirmal Treasury) అధికారి (డీటీఓ) సరోజ గురువారం తెలిపారు. ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన బిల్లులను ఇకపై ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా మాత్రమే సమర్పించాలని పేర్కొన్నారు. ఈ విధానం అన్ని ప్రభుత్వ శాఖలకు వర్తిస్తుందని, జిల్లా పరిధిలోని అన్ని డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు (డీడీఓలు) బిల్లులను ఆన్లైన్లో మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
బిల్లులతోపాటు అవసరమైన ఆధార పత్రాలను స్కాన్ చేసి తప్పనిసరిగా జతచేయాలని సూచించారు. సమర్పించే అన్ని పత్రాలను సమాచార సాంకేతిక చట్టం–2000 ప్రకారం చెల్లుబాటు అయ్యే డిజిటల్ సంతకంతో ధృవీకరించాలని తెలిపారు. ఈ నెల 15 నుంచి ట్రెజరీ కార్యాలయాలకు హార్డ్ కాపీ బిల్లులు స్వీకరించబోమని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని ఉప కోశాధికారులు తమ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు ఈ ఆదేశాలను తెలియజేసి ఖచ్చితంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

