కలం, నిర్మల్ : వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా మట్టి గణపతులను తయారు చేసి పూజించాలని నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని కస్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతినబూనారు. శుక్రవారం పాఠశాలలో విద్యార్థులు తమ చిట్టి చేతులతో మట్టి గణపతులను తయారు చేశారు.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలను చెరువులు, నీటి వనరుల్లో నిమజ్జనం చేయడంవల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని అవగాహన కల్పించారు. ప్రకృతిని అమ్మలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, పర్యావరణహితమైన మట్టి విగ్రహాలనే ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఈఓ భోజన్న, ప్రధానోపాధ్యాయులు మధుసూదన్, ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, భూమన్న, దశరథ్, విద్యార్థులు పాల్గొన్నారు.

