కలం, నిర్మల్: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’(Har Ghar Tiranga) కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్(MLA Pawar Rama Rao) పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని కోరారు. సోమవారం భైంసా పట్టణంలోని తన నివాసంపై ఎమ్మెల్యే జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు.
ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా ప్రజలు ముందుకు రావాలని కోరారు. ఈ నెల 13న భైంసాలో నిర్వహించనున్న తిరంగా ర్యాలీని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని జాతీయ స్ఫూర్తిని చాటాలని కోరారు. దేశభక్తి భావనను ప్రతి ఒక్కరిలో పెంపొందించేలా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.

