కలం, హనుమకొండ : కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య (Kadiyam Kavya) కోరారు. ఈ మేరకు గురువారం సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. కాజీపేట జంక్షన్కు ఉన్న రైల్వే ప్రాధాన్యతను వివరించారు. కాజీపేటకు ప్రత్యేక డివిజన్ ఏర్పాటు చేస్తే రైల్వే పరిపాలనా సామర్థ్యం పెరగడంతో పాటు మౌలిక వసతులు, ప్రయాణికుల సౌకర్యాలు, సరుకు రవాణా మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు.
బొగ్గు, సిమెంట్, బియ్యం, మిర్చి, గ్రానైట్, ఎరువుల రవాణాలో కాజీపేట కీలకంగా ఉందన్నారు. సికింద్రాబాద్ డివిజన్పై పెరుగుతున్న పరిపాలనా, ట్రాఫిక్ భారాన్ని తగ్గించేందుకు కూడా కాజీపేటను ప్రత్యేక డివిజన్గా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇది వరంగల్ ప్రాంత ప్రజల చిరకాల డిమాండ్ అని, సానుకూలంగా పరిశీలించాలని జీఎంను కోరారు.

