కలం, వెబ్ డెస్క్: భారతదేశ హిందూ సనాతన ధర్మ ఆచరణపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు తాము నివసిస్తూ ఉపాధి పొందుతున్న కర్మభూమి పట్ల విధేయతతో ఉండాలని.. అలాగే తమ జన్మభూమి భారత్ అందించిన విలువలు, సంప్రదాయాలను కొనసాగించాలని సూచించారు. హిందూ రాష్ట్రం అంటే ఇండియా నుంచి ముస్లింలను వెళ్లగొట్టడం కాదు అని అన్నారు.
భిన్నత్వంలోనే ఏకత్వం అనేది భారత్ డీఎన్ఏలోనే ఉందని చెప్పారు. భారత్లోని విజ్ఞానం అందరికీ చేరాలని అభిప్రాయపడ్డారు. భిన్నత్వం సహజం, ఏకత్వం బలం అని పేర్కొన్నారు. ఎవరైనా సమాజం నుంచి తీసుకున్నది తిరిగి సమాజానికి ఇవ్వాలని చెప్పారు. ఈ మేరకు అమెరికా న్యూయార్క్లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో జరిగిన ‘యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్’ కార్యక్రమంలో 6,000 మందికి పైగా భారతీయ-అమెరికన్లతో పాటు అంతర్రాష్ట్ర నాయకులను ఉద్దేశించి మాట్లాడారు.
భిన్నత్వం ఏకత్వంతో కలిసి ఉండగలదని భారతీయులు ప్రపంచానికి చూపించాలని మోహన్ భగవత్ (Mohan Bhagwat) అభిప్రాయపడ్డారు. దేశాలు కేవలం భౌగోళిక అస్తిత్వాలు మాత్రమే కావని చెప్పిన ఆయన.. వాటిని సాధించాల్సిన ఒక ఉన్నతమైన లక్ష్యం, నెరవేర్చాల్సిన గమ్యం ఉంటుందన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనగానే బహుళత్వం అనే పదం గుర్తుకు వస్తుందని.. అదే భారత్ విషయానికి వస్తే భిన్నత్వంలో ఏకత్వం అనే విషయం ఉంటుందని చెప్పుకొచ్చారు.

