ప్రాణత్యాగానికైనా సిద్ధం.. మాజీమంత్రి సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్​ డెస్క్​ : ఆగస్టు 31లోగా సీసీఐ పునరుద్ధరణపై స్పష్టత లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడుతానని, అవసరమైతే ప్రాణత్యాగానికైన సిద్ధం అని బీఆర్ఎస్​ మాజీమంత్రి జోగు రామన్న (Jogu Ramanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీసీఐ పునరుద్దరణపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చేసిన వ్యాఖ్యలను రామన్న తీవ్రంగా ఖండించారు.

పక్క రాష్ట్రంలోని స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇస్తుండగా, ఆదిలాబాద్ ప్రజలు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపించినప్పటికీ సీసీఐ పరిశ్రమను పునరుద్ధరించకుండా విక్రయించే ప్రయత్నాలు చేయడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో ఎన్నికల సమయంలో అమిత్ షా ఆదిలాబాద్ ప్రజలకు సీసీఐ పునరుద్ధరణపై హామీ ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు.

సీసీఐ పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడమే కాకుండా, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా కనీస చిత్తశుద్ధి చూపడం లేదని జోగు రామన్న ఆరోపించారు. సీసీఐలో చట్టవిరుద్ధంగా స్క్రాప్ టెండర్లు పిలిచారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాటిని అడ్డుకునేందుకు కోర్టును ఆశ్రయించిన విషయాన్ని రామన్న గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు కమీషన్లు వచ్చే పనులపైనే దృష్టి ఉందని ఆరోపించారు.

సీసీఐ సాధన సమితి.. పరిశ్రమ పునఃప్రారంభం కోసం నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తుంటే బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే ప్రజల ముందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ నాయకులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, గతంలో సీసీఐ పునరుద్ధరణపై హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం ఆదిలాబాద్ ప్రజలను, యువతను మోసం చేయడమేనని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్‌పీఎస్ నిధులతో సీసీఐ పరిశ్రమను పునఃప్రారంభించేందుకు కేంద్ర సహకారం కోరినా స్పందన రాలేదని జోగు రామన్న ఆరోపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>