కలం, నల్లగొండ: రైతుల దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారానికి భూముల రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నల్లగొండ (Nalgonda) కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం శాలిగౌరారం మండలం వద్దిపాముల గ్రామంలో రీసర్వేపై ఏర్పాటు చేసిన గ్రామసభకు హాజరయ్యారు. కొంతమంది రైతులు బాటలు, దారుల సమస్య, పట్టాలు లేకపోవడం, భూమి ఉన్న కబ్జాలో లేకపోవడం వంటి సమస్యలను గ్రామసభ దృష్టికి తీసుకువచ్చారు.
అప్డేట్ లేకపోవడంతోనే సమస్యలు..
అనంతరం కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు భూములకు సంబంధించిన రికార్డులను అప్డేట్ చేస్తూ వస్తున్నా నక్షా, టిప్పన్ వంటి వాటిలో మార్పులు లేకపోవడం, కాగితాలపై ఉన్న భూముల వివరాలు క్షేత్రస్థాయిలో తెలియకపోవడం, మోకాపై ఉన్నా రకరకాల సమస్యల వలన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఆ విషయాలను ప్రభుత్వం గుర్తించి పరిష్కరించేందుకు భూముల రీ సర్వ్ చేయిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి కమతం సర్వే..
రీ సర్వేలో భాగంగా రైతులకు సంబంధించిన ప్రతి కమతాన్ని సర్వే చేస్తామని కలెక్టర్ తెలిపారు. సర్వే ద్వారా గ్రామానికి సంబంధించిన హద్దులను నిర్ణయించి, అనంతరం గ్రామ ఆస్తులను సర్వే చేస్తారని వివరించారు. అలాగే వ్యవసాయేతర భూములను సర్వే చేస్తారని వెల్లడించారు. రైతులు, గ్రామస్థుల సమక్షంలో సర్వేయర్ ద్వారా వ్యవసాయ భూములను సర్వే చేస్తారనిని తెలిపారు.
ఈ సర్వే ద్వారా కొత్త సమస్యలు రాకూడదని, ఎలాంటి తగాదాలు తలెత్త కూడదని కలెక్టర్ కోరారు. నల్లగొండ ఆర్డీవో వై.అశోక్ రెడ్డి, తహసీల్దార్ మాధవరావు, సర్పంచి సురేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ డి.శంకర్ రెడ్డి, ఎంపీడీవో రజిత, తదితరులు ఉన్నారు.

