కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలంలో యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నేడు తలపెట్టిన మహా ధర్నా నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. రైతులతో కలిసి నిర్వహించనున్న ధర్నాలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరెందుకు సిద్ధమైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Vemula Prashanth Reddy) ని బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం హౌస్ అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రశాంత్ రెడ్డి బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు. మరోవైపు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, మండల అధ్యక్షులను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేశారు. కామారెడ్డి పట్టణ నాయకులను అరెస్ట్ చేసి కామారెడ్డి పోలీసు స్టేషన్ కు తరలించారు. కామారెడ్డి, తాడ్వాయి, రాజంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డి పేట్, లింగంపేట, గాంధారి లాంటి చుట్టుపక్కల మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు ముఖ్య నాయకులను సైతం అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్ లకు తరలించారు. ముందస్తు అరెస్టులను బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. ప్రజాస్వామ్య యుతంగా రైతులతో కలిసి యూరియా కొరత యాప్ రద్దుపై ధర్నాకు సిద్ధమైన తమను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

