కలం, వెబ్ డెస్క్: ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సోమవారం రాష్ట్ర రెవెన్యూ, హసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లతో హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్ లో ముఖ్యంగా పేదల సొంతింటి కల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, దశాబ్దాల భూ సమస్యల శాశ్వత పరిష్కారం, భూభారతికి సంబందించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ సంకల్పం నెరవేరాలంటే అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పారు.
క్షేత్రస్థాయిలో అర్హులందరికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో సమస్యలు తలెత్తకుండా చూడాలని చెప్పారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకోవాలని వివరించారు. గ్రామాల్లో భూ వివాదాలు, పట్టాదారు పాస్ పుస్తకాల జారీ వంటి రెవెన్యూ అంశాలపై సాధ్యమైనంత వరకు పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలతో పాటు జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు, సంబంధిత హౌసింగ్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.

