కలం, ఖమ్మం బ్యూరో : భార్యను హత్య చేసిన వ్యక్తికి భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు. జిల్లాలోని టేకులపల్లి మండలం హనుమత్ తండాకు చెందిన గూగులోత్ భాస్కర్ కు, కొత్త తండాకు చెందిన మంగ కు 2004లో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత భాస్కర్ మద్యానికి బానిసై మంగను అనుమానంతో వేధిస్తుండేవాడు. పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టినప్పటికీ భాస్కర్ ప్రవర్తనలో మార్పు కనిపించలేదు.
ఈ నేపథ్యంలోనే 2020 డిసెంబర్ 2 న మంగ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు టేకులపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాస్కర్ తన సోదరుడైన నరేందర్ సహాయంతో పథకం ప్రకారం, ఇంట్లో ఒంటరిగా ఉన్న తన భార్యను చీరతో గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. మృత దేహాన్ని ఇల్లందు – ఖమ్మం రోడ్ లో శాంతి నగర్ సమీపంలోని బావిలో పడేసినట్టు నేరం అంగీకరించారు. భాస్కర్ పై హత్యా నేరం రుజువు కావడంతో పాటు, సాక్ష్యాలను నాశనం చేసిన నేరం కింద జీవిత ఖైదుతో పాటు రూ.2 వేలు జరిమానా విధిస్తూ కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

