కలం , మహబూబ్ నగర్ బ్యూరో : మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రం బండమీదిపల్లి సమీపంలోని రాజీవ్ గృహకల్ప సొసైటీ భవనాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. పరిశీలన సందర్భంగా పలు ఓవర్హెడ్ నీటి ట్యాంకులు కూలిపోవడంతో పాటు కొన్ని భవనాల పైకప్పులు పాక్షికంగా కూలినట్లు గుర్తించారు. ఈ పరిస్థితుల్లో నివాసితులకు ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
భవనాలపై సమగ్ర సాంకేతిక (స్ట్రక్చరల్) తనిఖీ నిర్వహించి నిర్మాణ స్థిరత్వంపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆర్&బీ అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. భవనాలు నివాసయోగ్యంగా ఉన్నాయా, ఇంకా ఎంతకాలం సురక్షితంగా వినియోగించవచ్చో స్పష్టంగా పేర్కొంటూ స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేట్ సమర్పించాలని సూచించారు. ఈ తనిఖీలో ఆర్డీఓ నవీన్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, ఆర్&బీ డివిజనల్ ఇంజనీర్ (డీఈ)తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

