కలం, స్పోర్ట్స్: జింబాబ్వే సిరీస్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ని ఆఫ్ఘనిస్థాన్తో జరుగుతున్న తొలి టీ20 తుది జట్టు నుంచి తప్పించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంజూ శాంసన్ తిరిగొచ్చాడనే కారణంతో వైభవ్ను పక్కనబెట్టడాన్ని భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth) తీవ్రంగా తప్పుబట్టారు. సెలెక్టర్ల నిర్ణయంపై శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్లో స్పందించారు. వైభవ్ లాంటి ప్రతిభావంతుడికి సరిగ్గా అవకాశాలు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.
గత సిరీస్లో అద్భుతంగా ఆడి 196.10 స్ట్రైక్ రేట్తో 151 పరుగులు చేసిన ఆటగాడిని ఎలా పక్కనబెడతారని ప్రశ్నించారు. వైభవ్ తుది జట్టులో లేకపోవడంతో తన భార్య కూడా ఆగ్రహం వ్యక్తం చేసిందని శ్రీకాంత్ తెలిపారు. ప్రతి మ్యాచ్కూ జట్టును మార్చడం వల్ల ఆటగాళ్లలో భయం పెరుగుతుందని హెచ్చరించారు. అలాగే సంజూ శాంసన్ మేనేజ్మెంట్ తీరుపై కూడా శ్రీకాంత్ విచారం వ్యక్తం చేశారు. జులైలో జరిగిన యూకే పర్యటనలో మొదట శాంసన్కు అవకాశం ఇచ్చి, తర్వాత వైభవ్తో భర్తీ చేశారని గుర్తుచేశారు.
ఆ తర్వాత శాంసన్ను మళ్ళీ వెనక్కి తెచ్చి, జింబాబ్వే సిరీస్కు విశ్రాంతినిచ్చారని చెప్పారు. ఇద్దరు ఆటగాళ్లను ఇలా మార్చి మార్చి ఆడించడం వల్ల ఇద్దరికీ నష్టం జరుగుతుందని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ఆటగాళ్లకు వరుసగా కొన్ని మ్యాచ్ల్లో అవకాశం ఇవ్వాలని, లేదా పూర్తిగా పక్కనబెట్టాలని సూచించారు. సరైన ప్లాన్ లేకుండా చెరి రెండు మ్యాచ్లు ఆడిస్తే వారి కెరీర్ దెబ్బతింటుందని హెచ్చరించారు.

