కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad)లో ఆహార కల్తీ (Food Adulteration) ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. బయట ఏం తినాలన్నా ఒకటికి పది సార్లు ఆలోచించాల్సి వస్తోంది. ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ, పాలు, పనీర్ నుంచి అల్లం, పసుపు, నూనె, కారం, మసాలాల వరకు అన్నీ కల్తీ చేసేస్తున్నారు. తాజాగా పలు బేకరీలు, స్వీట్ తయారీ కేంద్రాలపై హెచ్ ఫాస్ట్ (H FAST) అధికారులు నిర్వహించిన మెరుపు దాడుల్లో (Raids) షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్లో ఎంతో ఫేమస్ అయిన ఉస్మానియా బిస్కెట్లు (Osmania Biscuits) , మస్కా బన్లు, క్రీమ్ రోల్స్, మైసూర్ పాక్, వివిధ రకాల స్వీట్లు, కేకులు, కుకీలను తయారు చేసే యూనిట్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా కలుషితమైన నీటిలో ముంచిన ప్రొడక్షన్ ట్రేలను ఉపయోగించి బిస్కెట్లను తయారు చేస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. అంతేకాకుండా ఆయా తయారీ కేంద్రాలలో వాతావరణమంతా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు.
ఈ దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా నాణ్యత లేని, తప్పుగా లేబుల్ చేసిన వంట నూనెలను వాడుతున్నట్లు తేలింది. అలాగే ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే అనధికారిక సింథటిక్ ఫుడ్ కలర్స్ను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ తీవ్రమైన ఉల్లంఘనల నేపథ్యంలో సదరు తయారీ యూనిట్ల నిర్వాహకులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

