కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్హౌస్ (KCR Farmhouse) వద్ద పసుపు నీళ్లతో శుద్ధి చేసిన ఘటనలో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి వరదరాజ్పూర్కు చెందిన ఏడుగురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడుగురు నిందితులను పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకొని, న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, కోర్టు వారికి 15 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు నిందితులను సిద్దిపేట సబ్ జైలుకు తరలించారు.
ఫామ్హౌస్ వద్ద జరిగిన ఈ చర్య దళితులను అవమానించేలా ఉందంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేశారు. ఘటన స్థలంలో ఇప్పటికే ఫోరెన్సిక్ బృందాలు కీలక ఆధారాలను సేకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.

