కలం, కరీంనగర్: ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ ఆహార తయారీ కేంద్రాలు, నిబంధనలు పాటించని హోటళ్లపై కరీంనగర్ జిల్లా ఆహార భద్రత శాఖ విరుచుకుపడింది. రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ఆహార వ్యాపార సంస్థల్లో అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు (Karimnagar Food Safety Raids) నిర్వహించి కఠిన చర్యలు చేపట్టారు.
పాలు లేకుండానే ‘మిల్క్’ స్వీట్లు
బావుపేటలోని ‘శ్రీ బాలాజీ మ్యాజిక్ మిఠాయి’ తయారీ కేంద్రంలో అధికారులు జరిపిన సోదాల్లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. పాలు వాడకుండానే మైదా, చక్కెరలతో అజ్మేరి కలాకండ్, మిల్క్ మైసూర్ పాక్ తయారు చేసి కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోని బేకరీలు, స్వీట్ షాపులకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో తయారవుతున్న సుమారు 40 కిలోల కల్తీ స్వీట్లను వెంటనే ధ్వంసం చేయడమే కాకుండా, 1,300 కిలోల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సదరు సంస్థను మూసివేసి FSSAI రిజిస్ట్రేషన్ను సస్పెండ్ చేసేందుకు చర్యలు ప్రారంభించారు.
లైసెన్స్ లేని హోటల్ సీజ్ .. బొద్దింకల మయం
ఎటువంటి FSSAI లైసెన్స్ లేకుండా నిర్వహిస్తుండటంతో ఈ హోటల్ను అధికారులు వెంటనే మూసివేయించారు. మతామ్ అల్ హబీబి అరేబియన్ రెస్టారెంట్ లో గతంలో హెచ్చరించినా కృత్రిమ రంగులు వాడటం, కిచెన్లో బొద్దింకలు తిరుగుతుండటంతో 8 కిలోల ఆహారాన్ని పారవేసి, రెస్టారెంట్ FSSAI లైసెన్స్ను సస్పెండ్ చేశారు. వంటశాల అపరిశుభ్రత, బట్టర్ నాన్ తయారీలో ఫ్యాట్ స్ప్రెడ్ వినియోగంపై వివరణ కోరుతూ ఇంప్రూవ్మెంట్ నోటీసు జారీ చేశారు. సేకరించిన ఆహార నమూనాలను విశ్లేషణ నిమిత్తం రాష్ట్ర ఆహార ప్రయోగశాలకు పంపామని, ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు జిల్లావ్యాప్తంగా ఇటువంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆహార భద్రత శాఖ అధికారులు హెచ్చరించారు.

