కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) జిల్లా తీగలగుట్టపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) పనులను కలెక్టర్ చిత్రా మిశ్రా పరిశీలించారు. పనుల పురోగతి, ఇంకా చేపట్టాల్సిన పనులపై ఆర్అండ్బి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా బ్రిడ్జి నిర్మాణంతో పాటు నాలుగు వైపులా నిర్మించాల్సిన సర్వీస్ రోడ్లు, భూసేకరణ ప్రక్రియ, డ్రైనేజీ, ఇతర అనుబంధ నిర్మాణాలపై ఆరా తీశారు.
రోజూ పర్యవేక్షణ చేయాలి..
ఆర్వోబీ నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా రోజూ పర్యవేక్షణ నిర్వహించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్ నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సర్వీస్ రోడ్ల నిర్మాణం అత్యంత కీలకమని పేర్కొన్న కలెక్టర్, అవసరమైన భూసేకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఇందుకు సంబంధించి రెవెన్యూ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
ట్రాఫిక్ సమస్యలు ఉండవు..
ఆర్వోబీ అందుబాటులోకి వస్తే కరీంనగర్–చొప్పదండి మార్గంలో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గడంతో పాటు రైల్వే గేటు వద్ద ఏర్పడే నిరీక్షణకు ముగింపు లభిస్తుందని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ పనులను చేపట్టిందన్నారు. సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈఈ కుమారస్వామి, డీఈ కిరణ్, ఏఈ మధు పాల్గొన్నారు.

