కలం, వెబ్ డెస్క్: పేదలను తరలించి మూసీ ప్రాజెక్ట్ చేపడుతున్నారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా తరలిస్తున్నవారికి ఎంత పరిహారం ఇస్తున్నారో తెలియడం లేదని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పాత హైదరాబాద్ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. హై కోర్టు సహా ఇతర కీలక భవనాలు అక్కడి నుంచి తరలిపోయే పరిస్థితి వచ్చిందన్నారు.
చార్మినార్ ప్రాంతంలో పార్కింగ్ సదుపాయాన్ని మరింత మెరుగుపర్చాలని అక్బరుద్దీన్ ఒవైసీ సూచించారు. చాంద్రాయణ గుట్టలో సీవరేజ్ ప్లాంట్ల నిర్మాణానికి రూ.500 కోట్లు మంజూరు చేయడంపై ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. హైదరాబాద్ నగరంలో వేలాది నిర్మాణాలు ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వాటిపై వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

