కలం, కరీంనగర్: ప్రజల సమస్యలను వారి వద్దకే వెళ్లి పరిష్కరించే లక్ష్యంతో ఆగస్టు 17వ తేదీ నుంచి మండల స్థాయిలో ప్రజావాణి (Prajavani) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Chitra Mishra) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల ప్రజలు తమ సమస్యలు, వినతులు, ఇతర దరఖాస్తులను ప్రతి సోమవారం మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత అధికారులకు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని మండల స్థాయిలోనే ప్రజావాణి నిర్వహిస్తున్నందున, తమ సమస్యలు, వినతులు సమర్పించేందుకు జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.
మండల స్థాయిలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలు, వినతులు, ఇతర దరఖాస్తులను మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో సమర్పించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా కోరారు.
ఎక్కడెక్కడ?
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా చొప్పదండి మండలంలో ఏసీ ఎల్బీ, అశ్విని తానాజీ, మానకొండూర్లో ఏసీ రెవెన్యూ, శ్రీనివాస్ రెడ్డి, సైదాపూర్లో ట్రైనీ కలెక్టర్, చిగురుమామిడిలో డీపీఓ ప్రత్యేక అధికారిగా హాజరుకానున్నారు. హుజూరాబాద్ డివిజన్లో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ పాల్గొంటారు. అదేవిధంగా సంబంధిత మండలాల నుంచి సీఈఓ, డిప్యూటీ సీఈఓ, మండల ప్రత్యేక అధికారులు కూడా ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ సమస్యలను మండల స్థాయిలోనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందాలని అధికారులు సూచించారు.

