కలం, వెబ్ డెస్క్: లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీరుపై ఇటలీ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ దేశ ప్రధాని జార్జియో మెలోనీని ఉద్దేశించి రాహుల్ చేసిన అనుకరణ ఆమె గౌరవాన్ని తగ్గించేలా ఉందని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీలోని ఇటలీ ఎంబసీ ఒక ప్రకటన విడుదల చేసింది. రాజకీయ బేధాభిప్రాయాలు ప్రజాస్వామ్యంలో అత్యంత సహజమని, అంతర్గత విషయాల్లో ఇటలీ ప్రధాని ప్రస్తావన తెచ్చి, హేళన చేయడం ఏమాత్రం సరికాదని అభిప్రాయపడింది. భారత ప్రజస్వామ్య విశిష్టత, ఇక్కడి రాజకీయ నేతల పట్ల తమకు పూర్తి గౌరవం ఉంటుందని చెబుతూనే.. ఇటలీ కూడా భారత్ నుంచి ఇదే తరహా గౌరవాన్ని ఆశిస్తుందని వివరించింది. రాజకీయ చర్చలు ఆహ్వానించదగ్గవే అయినా, తమ ప్రధానిని గౌరవాన్ని తగ్గించే చర్యలను మాత్రం సమర్థించబోమని తేల్చి చెప్పింది.
అసలేం జరిగిందంటే..
ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ జాతీయ స్థాయి కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. మరీ ముఖ్యంగా విదేశాంగ విధానం పూర్తిగా విఫలమవుతోందని మండిపడ్డారు. ఇతర దేశాధినేతలను ఆలింగనం చేసుకోవడమే మోదీ దౌత్యం, విదేశాంగ విధానం అంటూ ఆరోపించారు. ఈ క్రమంలో ఏ దేశ ప్రధాని ఎదురొచ్చినా ఇలాగే ఆలింగనం చేస్తుంటారని వివరించారు.
ఈ క్రమంలో స్టేజీపైన ఉన్న మరో వ్యక్తి ఇటలీ ప్రధాని మెలోనీని కూడా ఇలాగే ఆలింగనం చేసుకుంటారని అనడంతో రాహుల్ సహా అక్కడున్నవారంతా పెద్ద ఎత్తున నవ్వారు. ఇప్పుడు ఇదే విషయం కాంట్రవర్సీకి దారి తీసింది. ఒక దేశ మహిళా ప్రధాని గురించి ఇలాగే మాట్లాడుతారా.. అని సోషల్ మీడియాలో బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

