కలం, వెబ్ డెస్క్: ఆలయాలు, బహిరంగ ప్రదేశాలు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చాలామంది భిక్షాటన చేస్తూ బతుకు పోరాటం చేస్తుంటారు. అయితే కొందరి రోజువారి ఆదాయం సాఫ్ట్వేర్ ఇంజినీర్ కంటే ఎక్కువగా ఉంటుందంటే ఆశ్చర్యపోవాల్సిందే. యూట్యూబర్ పురుషోత్తం (YouTuber Puroshottam) చేసిన ఓ ప్రయోగం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
హరిద్వార్లో తన స్నేహితుడు సచిన్ను బిచ్చగాడి వేషంలో కూర్చోబెట్టి, మెడలో QR కోడ్ స్కానర్ను ఏర్పాటు చేసి భిక్షాటన చేయించాడు. కొంతమంది ఈ విషయాన్ని పట్టించుకోకుండా వెళ్లిపోగా, మరికొందరు స్పందించి డిజిటల్ పేమెంట్ల ద్వారా డబ్బులు అందించారు. ఈ ప్రయోగం ద్వారా కేవలం 8 గంటల్లో సుమారు రూ.4,000 వచ్చినట్లు వీడియోలో వెల్లడించారు.
ఈ లెక్కల ప్రకారం ఇదే విధంగా ప్రతిరోజూ కొనసాగిస్తే నెలకు సుమారు రూ.1.2 లక్షల వరకు సంపాదించవచ్చని పురుషోత్తం పేర్కొన్నారు. అయితే భిక్షాటనను ఆదాయ మార్గంగా ఎంచుకోవద్దన్నాడు. కష్టపడి, నిజాయతీగా సంపాదించడమే ఉత్తమమని తన ఫాలోవర్లకు సూచించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

