కలం, కరీంనగర్ బ్యూరో: తమ డిమాండ్ల సాధన కోసం ఆలిండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ (AIGDSU) ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ హెడ్ పోస్టాఫీస్ ఎదుట గ్రామీణ తపాల ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్బంగా తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. గ్రామీణ తపాల ఉద్యోగులను 8వ వేతన సంఘం పరిధిలో చేర్చాలని కోరారు. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గ్రామీణ తపాల ఉద్యోగులకు పెన్షన్ పథకాన్ని సుప్రీం కోర్డు నిర్దేశించిన సూత్రాల ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవేకాక సీజీహెచ్ఎస్, ఈఎస్ఐ లేదా సమానమైన ఆరోగ్య భద్రతా సౌకర్యాలను గ్రామీణ తపాల ఉద్యోగులకు విస్తరించాలని, అలాగే Gratuity Act 1972 ప్రకారం గ్రాట్యూటీ మంజూరు చేయాలని కోరారు. అనవసరమైన, సాధ్యం కాని వ్యాపార లక్ష్యాల పేరుతో ఉద్యోగులపై ఒత్తిడి తేవడం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. వీటితోపాటు పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐజీడీఎస్యూ డివిజన్ సెక్రటరీ సుధాకర్, కోశాధికారి సుగుణాకర్, ఉపాధ్యక్షుడు ఎల్లన్న, సర్కిల్ ఆఫీస్ బేరర్ లచ్చన్న, గ్రామీణ తపాల ఉద్యోగులు పాల్గొన్నారు.

