కలం, వెబ్డెస్క్: హైదరాబాద్ (Hyderabad)లో మరో భారీ కల్తీ దందా వెలుగులోకి వచ్చింది. నిన్న మొన్నటి వరకు ఆహార కల్తీ గురించి విన్న ప్రజలకు అక్రమ వ్యాపారస్తులు కొత్త కల్తీని పరిచయం చేశారు. ఏకంగా ఉప్పుకు కలర్ వేసి డీఏపీ ఎరువుగా నమ్మించి అమ్మేస్తున్నారు. ఓ రైతు ఫిర్యాదుతో హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్పేట్లో జరుగుతున్న ఈ ఫేక్ డీఏపీ ఎరువు (Fake DAP Fertilizer) దందా గుట్టురట్టయింది. తనకు ఫేక్ డీఏపీ అమ్మారని బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని సదరు ఎరువుల తయారీ కేంద్రానికి చేరుకున్నారు.
అయితే పోలీసుల రాకను గమనించిన తయారీదారులు అక్కడి నుంచి అప్పటికే పరారయ్యారు. ఎరువుల తయారీకి వినియోగిస్తున్న కోళ్ల ఫారంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్కడి పరిస్థితులు పోలీసులనే షాక్కు గురి చేశాయి. గోడౌన్లో ఫేక్ డీఏపీ ఎరువు (Fake Fertilizer) కోసం సాల్ట్, జాజు లాంటివి కలిపి బ్యాగ్లో నింపి సరఫరా చేస్తున్నారు. అక్కడ మరో 1000 బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వీటి విలువ రూ.15 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. వీటిని ఏజెంట్ల ద్వారా ఇక్కడి నుంచి రైతులకు సరఫరా చేస్తున్నారు. పలు పెద్ద పెద్ద కంపెనీల బ్యాగ్లను అక్రమంగా ముద్రించి రవాణాకు వినియోగిస్తున్నట్లు తేలింది. అయితే ఈ కేసుకు సంబంధించి నిందితులను ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న సంచులను వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగిస్తామని తెలిపారు.
Read Also: అడవిని గెలిపించిన జనం: ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం!
Follow Us On : WhatsApp

