కలం, జగిత్యాల: జగిత్యాల (Jagtial) జిల్లా ధర్మపురి (Dharmapuri) మండలంలో జరిగిన అవాంఛనీయ ఘటన సంచలనం సృష్టిస్తోంది. అమ్మానాన్నల తర్వాత అల్లారుముద్దుగా చూసి విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే కామరూపంలో మృగమై ఓ నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ధర్మపురిలోని ఓ పాఠశాల కరెస్పాండెంట్ చల్లా శ్రీనివాస్ (Challa Srinivas) అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై మూడు రోజుల క్రితం అత్యాచారానికి పాల్పడినట్లు బంధువుల ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రానికి చెందిన ఆచిన్నారి సమీపంలోని ఓ స్కూల్లో చదువుకుంటోంది.
పాఠశాలలోనే దారుణానికి పాల్పడినట్లు ఆరోపణ
గత మంగళవారం ఆచిన్నారిని స్కూల్లోని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లిన కరెస్పాండెంట్ (Correspondent) చల్లా శ్రీనివాస్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిన చిన్నారికి రక్తస్రావం జరుగుతుండటం గమనించిన తల్లి ఆరా తీయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. చిన్నారి తల్లి బంధువులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితుడు చల్లా శ్రీనివాస్ను అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. గురువారం డీఎస్పీ పురుషోత్తం రెడ్డి ఈ ఘటనపై కులంకషంగా విచారణ జరిపి నిందితుడిని రిమాండ్కు తరలించారు.
ఆగ్రహంతో పాఠశాలపై దాడి.. అనుమతి రద్దు
ఈ ఘటనతో ఆగ్రహించిన బంధువులు, స్థానికులు స్కూల్పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మరోవైపు విద్యాశాఖ అధికారులు స్పందించి ఆపాఠశాల పర్మిషన్ను రద్దు చేశారు. ఆ స్కూల్లో చదువుతున్న 170 మంది విద్యార్థులు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చేరి విద్యాభ్యాసం చేయాలని సూచించారు. ఈ ఘటనతో తమ పిల్లలను పాఠశాలలకు పంపాలంటేనే భయమేస్తోందని, ఎవరిని నమ్మాలో తెలియట్లేదని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

