కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో కొత్త కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం ఎంతమాత్రం సహకరించడం లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికాలోని ఫార్చ్యూన్ 500 సంస్థల్లో ఒకటైన తన స్నేహితుడి కంపెనీని తెలంగాణకు తీసుకువచ్చి, ఇక్కడ పరిశ్రమను స్థాపించేందుకు తాను స్వయంగా కృషి చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ విషయమై ముఖ్యమంత్రితో వాషింగ్టన్ డీసీలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా ప్రయత్నాలు సాగించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఎలాంటి ప్రోత్సాహం, సౌకర్యాలు లభించకపోవడంతో ఆ సంస్థ ప్రాజెక్టును విరమించుకుని వెనక్కి వెళ్తోందని ఆయన వాపోయారు. కొత్తగా వచ్చే పెట్టుబడులను ప్రోత్సహించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందనడానికి ఇదే నిదర్శనమని విమర్శించారు.

