కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ)లో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంపై పునరాలోచించాలని సీపీఐ (CPI) జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కరీంనగర్ లో ఎలక్ట్రిక్ బస్సు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన నేపథ్యంలో ఈ బస్సుల సేఫ్టీపై పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించాకే బస్సులను అనుమతించాలని పేర్కొన్నారు. కరీంనగర్ – హైదరాబాద్ రూట్ లో ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణం ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యంగా ఉందని చెప్పారు.
ఎలక్ట్రిక్ బస్సులు తరచూ ఆగిపోవడంతో ప్రయాణికులు సకాలంలో తమ గమ్య స్థానాలకు చేరుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ కు అతి సమీపంలో ఎల్ఎండీ వద్ద ఎలక్ట్రిక్ బస్సులో పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించి వెంటనే బస్సును నిలిపివేయడంతో 41 మంది ప్రయాణికులు ప్రాణప్రాయం నుండి తప్పించుకున్నారని చెప్పారు. ఇదే ఘటన రాత్రి పూట జరిగితే డ్రైవర్ గుర్తించే వీలుండేది కాదని, నష్టం తీవ్రంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఎలక్ట్రిక్ బస్సుల్లో కనీసం ఫైర్ సేఫ్టీ పరికరాలు కూడా లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు.
ఆర్టీసీని జేబీఎంలాంటి ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పి ప్రభుత్వం ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందుని, ఎలక్ట్రిక్ బస్సుల్లో సేఫ్టీపై చర్యలు తీసుకునే వరకు ప్రయాణికులను రవాణాకు అనుమతించవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీకి సొంత బస్సులు కొనుగోలు చేయకుండ అద్దె బస్సులు, కంపెనీల బస్సులతో నడుపుతూ పూర్తి స్థాయి ప్రైవేట్ సంస్థగా మార్చేశారని శ్రీనివాస్ విమర్శించారు.

