కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా అశ్వారావుపేటలోని పెద్దవాగు ప్రాజెక్టు (Pedda Vagu Project) పునర్నిర్మాణ పనులను తక్షణమే చేపట్టి రైతులకు సాగునీరు అందించాలని సిపిఐ(CPI) నాయకులు డిమాండ్ చేశారు. సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య, సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా ఆధ్వర్యంలో పెద్దవాగు ప్రాజెక్టు నుంచి వేలేరుపాడు వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైతాంగానికి జీవనాధారంగా ఉన్న ఈ ప్రాజెక్టును పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్ల వేలాది ఎకరాలు సాగుకు దూరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు శిథిలావస్థకు చేరడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.
అత్యవసరంగా నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేయకపోతే రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాల కోసం సిపిఐ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని, ప్రభుత్వాలు స్పందించే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ పాదయాత్ర కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, ఎస్.డి. సలీం, నరాటి ప్రసాద్, వి. పూర్ణచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

