కలం, తిరుమలయపాలెం: పేద ప్రజల కడుపు నింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర నాయకులు రామసహాయం నరేశ్ రెడ్డి (Ramasahayam Naresh Reddy) స్పష్టం చేశారు. రేషన్ ద్వారా అందజేసే సన్నబియ్యం నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదన్నారు. శుక్రవారం తిరుమలయపాలెంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన చౌక ధరల దుకాణాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సరుకుల పంపిణీ తీరును పరిశీలించి, బియ్యం నాణ్యతపై లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో రేషన్ బియ్యంపై ప్రజలు పడిన ఇబ్బందులను తొలగించి నాణ్యమైన సన్నబియ్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు.
అంతకుముందు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘స్పైసీ హబ్ ఫ్యామిలీ రెస్టారెంట్’ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

