కలం, స్పోర్ట్స్ : తాష్కెంట్ (Tashkent) వేదికగా జరిగిన 38వ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఇన్ ఇన్ఫర్మాటిక్స్ (International Olympiad in Informatics 2026)లో చైనా(China) అదరగొట్టింది. మూడు స్వర్ణాలు, ఒక రజత పతకంతో పతకాల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆగస్టు 9 నుంచి 15 వరకు జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక పోటీలలో 90కిపైగా దేశాలు, ప్రాంతాల నుంచి దాదాపు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. రెండు పోటీ రోజులలో విద్యార్థులకు అత్యంత క్లిష్టమైన ప్రోగ్రామింగ్ సమస్యలను అందించారు. అల్గారిథమ్ డిజైన్, డేటా స్ట్రక్చర్స్, ప్రోగ్రామింగ్ అమలు వంటి అంశాలపై ప్రశ్నలు ఇచ్చి.. నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించేలా పోటీ నిర్వహించారు.
చైనాకు చెందిన షు కివెన్ 498.27 పాయింట్లతో మొత్తం పోటీలో అగ్రస్థానంలో నిలిచాడు. మరో చైనా పోటీదారు జావో షెంగ్హావో మూడో స్థానాన్ని సాధించాడు. దీంతో వ్యక్తిగత విభాగంలోనూ చైనా విద్యార్థులు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఇన్ ఇన్ఫర్మాటిక్స్ ప్రపంచంలోని ఐదు ప్రధాన అంతర్జాతీయ సైన్స్ ఒలింపియాడ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. 1989లో బల్గేరియాలో తొలిసారిగా ఈ పోటీలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి కంప్యూటర్ సైన్స్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను పరీక్షించడం ఈ ఒలింపియాడ్ ప్రధాన ఉద్దేశం. తదుపరి IOI పోటీ జర్మనీలో జరగనుంది.

