కలం, వెబ్ డెస్క్ : కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో వైసీపీ కాపు నేతల భేటీలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. కుల దరిద్రం వదిలితే తప్ప ఏపీ బాగుపడదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బొత్స స్పందించారు. తన కులం బాగుంటేనే , తను రాష్ట్రంలో బాగున్నట్టు లెక్క అని వ్యాఖ్యానించారు. కులాన్ని చూసే తమకు పదవులు వస్తాయని చెప్పారు. అయితే ఎన్నికలు వచ్చినప్పుడు నాకే ఓటు వేయాలని తన కులాన్ని అడగనని స్పష్టం చేశారు.
అలాగే వైసీపీ రౌడీ మూకలు, గుండాల పిచ్చి వేషాలు తమ వద్ద చెల్లవని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రౌడీ అనే పదం పవన్ కళ్యాణ్ కే వర్తిస్తుందని విమర్శించారు. వైసీపీ కాపు నేతలు రౌడీలు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. సాయి కృష్ణ మిస్సింగ్ పై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఫైర్ అయ్యారు. క్రిమినల్స్ అయితే చంపేస్తారా ? పవన్ కళ్యాణ్ అంటూ నిలదీశారు. కాపు సామాజిక వర్గంపై కూటమి నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితే కుదరదని హెచ్చరించారు.

