కలం, నిర్మల్ బ్యూరో : నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, దేశ సమగ్రత కోసం తన ప్రాణాలను అర్పించిన మహనీయుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ (Shyama Prasad Mukherjee) బలిదాన్ దివస్ను (Balidan Diwas) ఘనంగా నిర్వహించారు. మంగళవారం బీజేపీ ఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశంలో ‘ఒకే దేశం–ఒకే రాజ్యాంగం–ఒకే పౌరసత్వం’ అమలు కోసం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో అమలులో ఉన్న ఆర్టికల్ 370 రద్దు కోసం ఆయన చేసిన పోరాటం భారత చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని అన్నారు. దేశ ఏకత్వం, సమగ్రత కోసం ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. యువత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను ఆచరణలోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, కౌన్సిలర్లు శ్రీరామోజీ నరేష్, గంజి రాజు, ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ కందుల హరీష్, పట్టణ ప్రధాన కార్యదర్శి గిల్లి విజయ్, బీజేవైఎం రాష్ట్ర నాయకులు కుమ్మరి వెంకటేష్, పొలాస భరత్ తదితరులు పాల్గొన్నారు.

