కలం, వెబ్డెస్క్: కుటుంబ పోషణ కోసం వ్యాపారం చేసుకుంటున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని లింగంపల్లి (Lingampally)లో చోటు చేసుకుంది. వ్యాపారం చేసుకుంటే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించే ముందు సదరు వ్యక్తి ఏం వ్యాపారం చేశాడో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. బీహార్ (Bihar)కు చెందిన సన్నీ కుమార్ (28) కొన్నేళ్ల క్రితం తన కుటుంబ పోషణ కోసం తీవ్ర ఇబ్బంది పడేవాడు. ఈ నేపథ్యంలో గంజాయి సరఫరా వైపు ఓ కన్నేశాడు.
సన్నీ కుమార్ కొన్ని రోజులపాటు గంజాయి సప్లయర్గా పని చేశాడు. ఆ తర్వాత తనే నేరుగా గంజాయి కొనుగోలు చేయడం, అమ్మడం మొదలుపెట్టాడు. ఇలా పోలీసుల కళ్లు గప్పి ఇప్పటి వరకు బాగానే సంపాదించాడు. సన్నీ కుమార్ విశాఖపట్నం నుంచి గంజాయి కొనుగోలు చేసి బీహార్కు తీసుకొచ్చి అమ్ముతున్నాడు. ఈ క్రమంలో శనివారం విశాఖపట్నం నుంచి వెళ్తుండగా లింగంపల్లిలో పోలీసులకు పట్టుబడ్డాడు. సన్నీ కుమార్ దగ్గర రూ.7.50 లక్షల విలువైన 14.77 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

