కలం, ఖమ్మం బ్యూరో: ”మీరు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.. మీకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించే బాధ్యత నాది” అని భద్రాచలం ఎమ్మెల్యే (Bhadrachalam MLA) తెల్లం వెంకటరావు (Tellam Venkata Rao) విద్యార్థులకు కొండంత అభయాన్ని ఇచ్చారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం (Dummugudem) మండలం నారాయణరావు పేటలోని ప్రభుత్వ హాస్టల్ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో నేలపై కూర్చొని ఆప్యాయంగా ముచ్చటిస్తూ, వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. హాస్టల్లో అందుతున్న వసతులు, ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే, విద్యార్థుల సమస్యలను ఆరా తీశారు. అనంతరం కిచెన్, తరగతి గదులు, వసతి గదులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, పరిసరాల పరిశుభ్రతపై అధికారులకు పలు సూచనలు చేశారు.
సమీక్ష సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న వసతులు, సౌకర్యాలను ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హాస్టల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని, సంబంధిత అధికారులు ప్రభుత్వంతో మాట్లాడి వెంట వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు పాల్గొన్నారు.

